గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాకు సహకరించాలి
- డి. ఎస్పీ మొగిలయ్య.
గద్వాల, లోకల్ గైడ్:
గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాకు సహకరించాలని గద్వాల డి. ఎస్పీ మొగిలయ్య తెలిపారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డి.ఎస్పీ మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో మాదకద్రవ్యాల విషయములో యువతను దూరంగా ఉంచాలన్నారు. డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఐ యామ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అంటూ జిల్లా ఎస్పీ ఫొటో ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో షి టీం ఎస్సై స్వాతి, షి టీం సిబ్బంది, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.