“రాజమహేంద్రవరం అంటే గోదావరి తీరమే గుర్తొస్తుంది” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తీరం వెంట నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని చెప్పారు."ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది. ఎంతో కాలంగా ఉన్న కలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకం. పర్యటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యటకులు పెరిగే అవకాశముంది. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే దానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కారణం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ప్రత్యేక కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరుతున్నాం. రాజస్థాన్లో వీరులు పుట్టిన నేల నుంచే గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారు. ఆంధ్రుల పౌరుషం ఉన్న ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నారు" అని పవన్ కల్యాణ్ చెప్పారు.