షరతులకు రెండు దేశాలూ ఓకే..
లోకల్ గైడ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం జూలై 8నాటికి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఇరుపక్షాలు కూడా అంగీకరించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.గతంలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ అదనపు సుంకాలకు జూలై 8 వరకు గడువిచ్చారు. అంతవరకు ఆయా దేశాలు అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, జూలై 9 నుంచి ఆ సుంకాలు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇక భారత్ ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని మన దేశం గత కొన్ని నెలలుగా అమెరికాను కోరుతోంది. అదే సమయంలో అమెరికా కూడా భారత్పై కొన్నితరహా సుంకాలను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ను కలిశారు. ఇరుదేశాల మధ్య పరస్పరం లాభదాయకంగా ఉండే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపారు. ఆ చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.