షరతులకు రెండు దేశాలూ ఓకే..

షరతులకు రెండు దేశాలూ ఓకే..

లోక‌ల్ గైడ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం జూలై 8నాటికి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను ఇరుపక్షాలు కూడా అంగీకరించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.గతంలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ అదనపు సుంకాలకు జూలై 8 వరకు గడువిచ్చారు. అంతవరకు ఆయా దేశాలు అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, జూలై 9 నుంచి ఆ సుంకాలు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇక భారత్‌ ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని మన దేశం గత కొన్ని నెలలుగా అమెరికాను కోరుతోంది. అదే సమయంలో అమెరికా కూడా భారత్‌పై కొన్నితరహా సుంకాలను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌ను కలిశారు. ఇరుదేశాల మధ్య పరస్పరం లాభదాయకంగా ఉండే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపారు. ఆ చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఇక మరోవైపు, అమెరికా ఇప్పటికే చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. చైనాతో ఒప్పందానికి జీ జిన్‌పింగ్ అంగీకరించాల్సి ఉందని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. లండన్‌లో రెండు రోజులపాటు చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఒప్పందం ప్రకారం చైనా ఫుల్‌ మేగ్నెట్స్, రేర్ ఎర్త్ మినరల్స్‌ను ఎగుమతి చేయనుంది. అలాగే, చైనా విద్యార్థులు అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుకోవచ్చని ట్రంప్ తెలిపారు.ప్రస్తుతం భారత ఉత్పత్తులపై అమెరికా 10 శాతం టారిఫ్ విధిస్తోంది. అదనంగా, ఈ ఏప్రిల్ 2న ట్రంప్ మన దేశంపై 26 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, జూలై 9 వరకు ఆ అదనపు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇకపుడు, ఈ 26 శాతం అదనపు సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.

Tags:

About The Author

Latest News