నేటి నుంచి పాత వాహనాలకు ఇంధన బంద్.. ఎందుకు?
లోకల్ గైడ్: జీవితకాలం ముగిసిన వాహనాలకు ఇక నుంచి ఇంధనం అందదు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకూడదని ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు అది కఠినంగా అమలు చేస్తున్నారు.దీనుకోసం ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (DTIDC) ఆధ్వర్యంలో నగరంలోని 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.ఈ ఏడాది నవంబర్ 1 నుంచి ఈ నిషేధాన్ని గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్లకు విస్తరించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లోని మిగతా ప్రాంతాలపైనా ఈ నిబంధన అమలు చేయనున్నారు.ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో జీవితకాలం ముగిసిన వాహనాల సంఖ్య భారీగానే ఉంది. కేవలం ఢిల్లీలోనే 62 లక్షల బైకులు, 41 లక్షల కార్లు ఈ కేటగిరీలో ఉన్నాయి. ఎన్సీఆర్ మొత్తం చూసుకుంటే హర్యానాలో 27.5 లక్షలు, ఉత్తరప్రదేశ్లో 12.4 లక్షలు, రాజస్థాన్లో 6.1 లక్షల వాహనాలు జీవితకాలం పూర్తి చేసుకున్నవే.2018లో సుప్రీంకోర్టు 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలను, 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ వాహనాలను ఢిల్లీలో నిషేధించిన సంగతి తెలిసిందే.