విద్య కాదు.. వ్యధ అవుతోంది! స్కూల్ బ్యాగులపై జీవో 22 అమలు ఎందుకు లేదో ఎవరికీ అర్థం కావడం లేదు
పిల్లలు బడికి వెళ్తున్నారో విద్య కోసం.. కానీ వారికి ఎదురవుతున్నది విద్యాభ్యాసం కంటే ముందుగా బ్యాగు భారం. నాలుగు పదాలు చదవలేని వయసులోనే వాళ్లు నాలుగు కిలోల బరువును భుజాలపై మోస్తున్నారు. ఇది పిల్లల భవిష్యత్తు పట్ల మన సమాజం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం కాదు అని ఎవరైనా చెప్పగలరా?
నర్సరీ నుంచే పుస్తకాల మోత మొదలవుతోంది. 3-4 ఏళ్ల చిన్నారుల చేతుల్లో నాలుగు పుస్తకాలు, రెండు వర్క్ బుక్స్, వాటికి తోడు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్..! ఇంత భారం వారివాళ్ల భుజాలు భరించలేవని తెలిసినా, ఎవరూ పట్టించుకోవడం లేదు.
పిల్లలలో భయం, ఒత్తిడి పెరుగుతుంది. వయస్సుకి మించిన ఒత్తిడికి గురవుతున్నారు. భవిష్యత్ శారీరక, మానసిక ఆరోగ్యం పైన ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తోందని నిపుణుల హెచ్చరికలే దీనికి తార్కాణం.
పిల్లల విద్య అంటే పుస్తకాలు మాత్రమే కాదు.. ఆటలూ, అనుభవాలూ, ప్రశ్నలు వేయగల స్వేచ్ఛ కూడా కావాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు స్కూల్ను ఒక బరువైన బంధనంగా భావిస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిగణనలోకి తీసుకుని జీవో 22ను కఠినంగా అమలు చేయడం అవసరం.