చిన్న స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం
తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారి నవీన్ కుమార్
వికారాబాద్, లోకల్ గైడ్: వికారాబాద్ కలెక్టరేట్ లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో బుధవారం జనరల్ మేనేజర్ మహేశ్వర్ అధ్యక్షతన ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పై వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్య , పశుసంవర్ధక శాఖల అధికారులు ఇతర సంబంధిత శాఖల అధికారులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారి నవీన్ కుమార్ బసురి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పథకం యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వ మద్దతు గురించి సమగ్ర సమాచారమును అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫుడ్ ప్రాసెసింగ్,రైతుల ఆదాయ వృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ వృద్ధి తదితర అంశాలపై ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, లేబెలింగ్, మార్కెటింగ్ లింకేజెస్, రుణాల సదుపాయాలు వంటి అంశాలను ప్రభుత్వం కల్పించడం జరుగుతుందన్నారు. పథకంలో భాగంగా వ్యక్తిగత యూనిట్లకు 35% రాయితీ, గరిష్ఠంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.సమూహ ప్రాజెక్టులకు (ఎఫ్పిఓలు, స్వయం సహాయక సంఘాలు, ప్రొడ్యూసర్ గ్రూపులకు) గరిష్ఠంగా 3 కోట్ల వరకు రాయితీ పొందవచ్చని ఆయన వివరించారు.వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువవృద్ధి, బ్రాండింగ్, మార్కెటింగ్, రుణ మద్దతు తదితర అంశాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయపడుతుందని ఆయన తెలిపారు.సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, జిల్లాలో మరింత మంది లబ్ధిదారులు ఈ పథకం ప్రయోజనాలను పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.మరిన్ని వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని 8121009155 ద్వారా సంప్రదించాలని ఆయన సూచించారు.ఈ అవగాహన సదస్సులో వ్యవసాయ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.