జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ (లోకల్ గైడ్): జిల్లాలోని డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మెనూ బోర్డును పరిశీలించి, మెనూకు అనుగుణంగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. అధ్యాపకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ సమయ పాలన పాటిస్తూ, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. పర్యవేక్షణ అధికారి ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. టాయిలెట్ లను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. కాగా, గురుకులంలో ఇంకనూ ఏమైనా సదుపాయాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
About The Author
Related Posts
