ఎస్సీ, ఎస్టీ ఆధిక్య ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కేంద్రం తీసుకున్న చర్యలేంటి.
ఖమ్మం లోకల్ గైడ్ :
లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల గుర్తింపు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఆధిక్య ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం లోక్సభలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
బాలికల కోసం ఈబీబీ ద్వారా అభివృద్ధి చర్యలు..
జిల్లాల స్థాయిలో కాకుండా మహిళల గ్రామీణ అక్షరాస్యత జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ బ్లాక్స్ (ఈబీబీ)లుగా గుర్తించి అక్కడ విద్యా అభివృద్ధి చర్యలు అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.బాలికల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా( కేజీబీవీ )లు
ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5,269 కేజీబీవీలు పనిచేస్తుండగా, వాటిలో 7.58 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారని తెలిపారు. ఇందులో గణనీయ సంఖ్యలో ఎస్సీ, ఎస్టి బాలికలు ఉన్నట్లు వెల్లడించారు.
ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా ఇలా..
అలాగే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, బ్లాక్ ల ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో విద్యతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి వివరించారు.
