పట్టణంలో రోడ్డు వెడల్పు అందరికీ ఉపయోగకరంగా ఉండాలి...
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); బెల్లంపల్లి పట్టణంలో 100ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు చేపట్టడం లాంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వాగతిస్తున్నామని రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు.గతంలో రోడ్డు వెడల్పులో చిరువ్యాపారస్తులు ఉపాధి కోల్పోయారని,వారికి ప్రత్యామ్యాయం ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చిన గత పాలక ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు ప్రజాప్రతినిధులు వారికి ప్రత్యామ్నాయం చూపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ప్రస్తుతం సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి కొత్త బస్టాండ్ వరకు100ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు చేస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారని తెలిపారు.ఈ రోడ్డు వెడల్పు పనుల ద్వారా చాలామంది చిరు వ్యాపారస్తులు తమ ఉపాధిని కోల్పోతున్నారని వీరికి ఉపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సింగరేణి కి సంబంధించిన 165వ్యాపార సముదాయాలను సింగరేణి యాజమాన్యం 2018లో స్థానిక రెవెన్యూ శాఖకు అప్పగించారని,2019సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిల్ లో పురపాలక సంఘానికి అప్పజెప్పాలని కౌన్సిల్ తీర్మానం కూడా చేశారు.కానీ అప్పటినుండి ఇప్పటివరకు పురపాలక సంస్థకు అప్పజెప్పలేదు,కారణాలు ఏమైనప్పటికీ స్థానిక పురపాలక సంఘం కమిషనర్165 షాప్స్ కు సంబంధించి నోటీసులు జారీ చేశారని,అందులో పేర్కొన్న165 షాపులు వారి పేర్లపై నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.సింగరేణి యాజమాన్యం రెవెన్యూ శాఖకు అప్పగించిందని,రెవెన్యూశాఖ మున్సిపాలిటీకి అప్పగించాలి మరి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు.పైగా ప్రభుత్వానికి సంబంధించిన ఈ వ్యాపార సముదాయాలకు మున్సిపాలిటీ నెంబర్లు కూడా ఇచ్చిందని తెలిపారు.నోటీసులలో తమ వద్ద ఆధారాలను 5రోజుల్లోగా తమకు సమర్పించాలని లేకపోతే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారని,ఆధారాలు సమర్పిస్తే వారికే సొంతం చేస్తారా అని ప్రశ్నించారు.రెవెన్యూ యంత్రాంగం పురపాలక సంఘం కమిషనర్ ఈ165 షాపుల విషయమై అసలు నిజాలు ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.అభివృద్ధి అంటే రోడ్లు వెడల్పు చేయడం,రోజు చిరు వ్యాపారాలు చేసుకుని బ్రతికే వారి ఉపాధినుండి గెంటి వేయడం కాదని,వారి జీవన ప్రమాణాలు పెంచడం,వారికి ఉపాధి చూపించడం అని పేర్కొన్నారు.పెన్షన్లు,నిరుద్యోగ భృతి ఇస్తామని కాదు ఎన్నో వనరులున్న బెల్లంపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం,తద్వారా వ్యాపారాలే కాదు పట్టణం కూడా అభివృద్ధి అవుతుందని అన్నారు.ఈ సమావేశంలో నాయకులు టీ మణిరాం సింగ్,ఎండి చాంద్ పాషా,అంబాల మహేందర్,గోగర్ల శంకర్,దుగుట తిరుపతి,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.