కన్నాయిగూడెం గ్రామపంచాయతీలో బురద నీరే గతి?
ఆరోగ్య సమస్యలతో గ్రామం విలవిల!
భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట (లోకల్ గైడ్); మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ గోపన్న గూడెం గ్రామంలో గత కొంతకాలంగా బురద నీటితోనే కాలం వెళ్లదీస్తున్నామని, పంచాయతీ కార్యదర్శికి, ప్రత్యేక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని గోపన్నగూడెం గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని గోపన్న గూడెం గ్రామంను రెండు భాగాలుగా విభజించి రెండు బోర్లు, మోటార్లు, రెండు ట్యాంకులను ఏర్పాటు చేశారని, గోపన్నగూడెం దిగువ భాగంలో ఉన్న ప్రాంతానికి ఒక బోరు ట్యాంకు నల్లా కనెక్షన్లు ఇచ్చారని, బోరు దిగువ భాగంలో ఉండటం వలన, పైన ఉన్న కేసింగ్ పైపు పగిలిపోయి సంవత్సర కాలంగా వర్షం పడిన ప్రతిసారి వరద నీరు చెత్తాచెదారం మొత్తం బోరులోకే వెళుతుందని, దీంతో వాటర్ ట్యాంక్ లోకి బురద నీరే వస్తుందని, ఈ బురద నీరు ఉపయోగించడం వలన గ్రామంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ మధ్యకాలంలో మలేరియా టైఫాయిడ్ అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని బురద నీరును అరికట్టి, మంచినీటిని అందించాలని గోపన్నగూడెం గ్రామ ప్రజలు కోరుతున్నారు.