“ఓ బుజ్జ గణపయ్యా… నీ బంటు నేనయ్యా” — ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రార్థన
షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
షాద్నగర్ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఘనంగా పూజలు జరిగాయి. ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తన క్యాంపు కార్యాలయంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి, కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు.
“ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగిపోవాలి. గణనాథుడు అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రజలు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.
వేదపండితుల ఆశీర్వచనాల మధ్య స్వామిని ఆరాధించిన ఎమ్మెల్యే, షాద్నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా గణపతి మండపాలు వెలుస్తుండగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా శంకర్ అధికారులను ఉద్దేశించి, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ఈ ఏడాది కూడా ప్రభుత్వం అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.
“ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. గణపతి నవరాత్రులలో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగలు జరగాలని సంబంధిత అధికారులు కృషి చేయాలి” అని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు.
కార్యాలయంలో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.