*ఉమ్మడి జిల్లాలో ఘనంగా రక్షా బంధన్*
నిజామాబాదు ,లోకల్ గైడ్ :
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో శనివారం రక్షా బంధన్ కార్యక్రమాలు ఘనంగా జరుపుకొన్నారు . స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆయా ఊర్లకు వెళ్ళడానికి ప్రయాణికులతో ఆర్టీసీ ప్రాంగణాలు కిక్కిరిసి పోయాయి . సోదరీసోదరుల ఆత్మీయతకు అద్దం పట్టేదే రక్షాబంధన్. కష్టసుఖాల్లో మేమ మీకు అండగా ఉంటామనే భరోసాను సోదరులు అక్కాచెల్లెళ్లకు కల్పించడమే రాఖీబంధం. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ చిహ్నానికి వారి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.
నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ జవాన్లకు, కార్మికులకు మహిళా సిబ్బంంది రాఖీలు కట్టారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి అక్క దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆర్మూర్ పట్టణంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి ఆయన సోదరి రాఖీ కట్టారు. ఆర్మూర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులంతా సామూహికంగా యజ్ఞం చేశారు.
నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ వినూత్న రీతిలో అన్నాచెల్లెల బంధాన్ని గుర్తుచేశారు. రాఖీ పండుగ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఆయన కూతురు వర్షిణి, కొడుకు సాయితేజ స్వయంగా రాఖీ కట్టారు. సమాజంలో సమానత్వం, సోదరభావం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేడ్కర్ అని, ఆయనను అన్నగా భావించి రాఖీ కట్టడం తమకు గర్వకారణమని తెలిపారు.
About The Author
