స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
గద్వాల, లోకల్ గైడ్ :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని,108 అంబులెన్స్ ను వేడుక వద్ద అందుబాటులో ఉంచాల న్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో ప్రగతిని ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పంద్రాగస్టు వేడుకకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు లతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
About The Author
