చింతకుంట బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ..
విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి.దొడ్డుబియ్యం సరఫరాపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
డీ.ఎస్వో పై చర్యలకు సివిల్ సప్లై కమిషనర్కు ఆదేశాలు..
లోకల్ గైడ్ కరీంనగర్ జిల్లా : చింతకుంటలోని బాలికల గవర్నమెంట్ గురుకుల పాఠశాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అకస్మికంగా సందర్శించి పలు సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తనిఖీ సందర్భంగా బాలికలతో కలిసి భోజనం చేసిన మంత్రి 15 రోజులుగా నాణ్యతలేని దొడ్డుబియ్యంతో వంట చేస్తున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ నుంచి ఫిర్యాదు అందుకున్నారు.
ఈ విషయాన్ని తక్షణమే సీరియస్గా తీసుకున్న మంత్రి, కరీంనగర్ డీ.ఎస్.ఓ.తో ఫోన్లో మాట్లాడి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని వెంటనే మార్చాలని ఆదేశించారు.అనంతరం సివిల్ సప్లై కమిషనర్ చౌహన్తో ఫోన్లో మాట్లాడి,బాధ్యతా రహితంగా వ్యవహరించిన డీ.ఎస్.ఓపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలిని స్పష్టం చేశారు.ఆశ్రమ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, పలు అభివృద్ధి పనులకు సూచనలు ఇచ్చారు.
మెస్ పరిసరాల అభివృద్ధి,అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకం,అదనపు వాటర్ ప్లాంట్ నిర్మాణం,వారం రోజుల్లో స్టీల్ వంట పాత్రల ఏర్పాటు,స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మాణం (ఆక్రమణ నివారణ కోసం),క్యాంపస్లో ఎలక్ట్రిసియన్ నియామకం అదేవిధంగా,విద్యార్థుల క్రీడా అభివృద్ధి కోసం బాస్కెట్ బాల్ కోర్టు మరియు మైదానం అభివృద్ధికి కూడా మంత్రి హామీ ఇచ్చారు. తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి వారం లోపల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎస్సి విద్యార్థుల సంక్షేమంపై రాజీపడే ప్రసక్తే లేదని,మా సీఎం గారిది స్పష్టమైన దృష్టి,సంకల్పమని ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.
About The Author
