విద్యార్థులకు మార్గదర్శకులు గురువులే - జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
దేశ అభివృద్ధి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
గద్వాల, లోకల్ గైడ్ :
విద్యార్థులకు మార్గదర్శకులు గురువులేనని, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షనల్ హాల్లో ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో దేశ అభివృద్ధి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయుల అంకితభావం, శ్రమను గుర్తించి వారిని గౌరవించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ తన విద్యాభ్యాసాన్ని గుర్తుచేసుకుంటూ, ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ,విలువలే తన విజయానికి పునాది కాగా,అవే ఐఏఎస్ స్థాయికి తీసుకువచ్చాయని, ఆ విలువలను ఇప్పటికీ ప్రతిరోజూ తన జీవితంలో పాటిస్తున్నానని అన్నారు. జిల్లాలో పదవ తరగతి–2025 ఫలితాల్లో రాష్ట్రంలో 32వ స్థానం నుండి 26వ స్థానానికి చేరి 10.36% వృద్ధి సాధించిందని,ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులను అభినందిస్తూ, మరింత నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూట్యూబ్ తదితర వనరుల ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా బోధన చేయాలన్నారు. ప్రతి టీచర్ 10 మంది విద్యార్థులను అడాప్ట్ చేసుకొని మోటివేట్ చేసి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి వారం రెండు పాఠశాలలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. పాఠాలను సరిగ్గా అర్థం చేసుకోలేని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, మంచి ఫలితాలు సాధించాలన్నారు. గద్వాల ప్రాంతంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైన విద్యతో పాటు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. గద్వాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సమాజంలో అత్యున్నత స్థానాలను సాధిస్తూ, గొప్ప ప్రేరణగా నిలిచారని ,ఎస్బీఐ చైర్మన్ ఆ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. విద్యా ప్రగతికి ఉపాధ్యాయుల సూచనలను స్వీకరించి, వాటిని కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. టీచర్ ప్రవర్తనను బట్టి పిల్లల ప్రవర్తన ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు ఉన్నతంగా ఉంటూ పిల్లలకి చదువుతో పాటు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అన్నారు.మంచి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు. గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కృషి వల్ల విద్యార్థులు మెరుగైన విద్యతో పాటు క్రమశిక్షణలో అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. భారతదేశానికి రాష్ట్రపతి అయిన వారు తమ గురువుల సూచనలు పాటిస్తూ ఉన్నతస్థాయి సాధించారని, ఇది ఉపాధ్యాయుల పాత్రను ప్రదర్శిస్తుందని చెప్పారు. ప్రపంచ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థుల జీవితాల్లో వారు బోధించే ప్రతి విద్య విలువ అత్యంత ముఖ్యమని అన్నారు. గద్వాల ప్రాంతం ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని, ఉపాధ్యాయుల కృషి వల్ల అక్షరాస్యత,విద్యా ప్రమాణాల్లో ఉన్నత స్థాయి సాధించబడిందని గుర్తు చేశారు.గట్టు మండలం భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి అయితే, ఈరోజు అక్షరాస్యత మెరుగుపడుతూ ముందుకు వెళ్తుందని తెలిపారు. మట్టిలో మాణిక్యం ఉన్నట్టే, గ్రామీణ ప్రాంతంలోని ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసి ఉత్తమ స్థాయికి తీసుకువచ్చారని అన్నారు.ప్రతి రంగానికి ఒక గురువు ఉంటారని అన్ని రంగాల్లో ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి గురువుల తోడ్పాటు అవసరమని అన్నారు. గురువులు సమాజానికి అవసరమయ్యే భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేయాలన్నారు.గద్వాల్ జిల్లాలో 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులను, పదవ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేసిన 10 పాఠశాలల ఉపాధ్యాయులకు కలెక్టర్, గద్వాల శాసనసభ్యులు వారికి ప్రశంస పత్రం, మేమెంటో, శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వయోజనవిద్యా శాఖ మార్గదర్శిని పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని, మండల విద్యాశాఖ అధికారులు , ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.