పాలకుల విధానాలతో వ్యవసాయం సంక్షోభంలోకి కూలీలుగా మారుతున్న రైతాంగం
ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినేపల్లి ప్రభాకర్
రాష్ట్ర మహాసభల గోడ పోస్టర్ ఆవిష్కరణ
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
దేశాన్ని ఏలుతున్న పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఫలితంగా రైతులు తమ భూములను కోల్పోయి కూలీలుగా మారుతున్నారని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినేపల్లి ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం అశ్వారావుపేటలోని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా పాలకులు స్వదేశీ వ్యవసాయ విధానాలను విస్మరించి, సామ్రాజ్యవాద మరియు స్వదేశీ గుత్త పెట్టుబడిదారుల లాభాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. దీనివల్లఅంతర్జాతీయ మార్కెట్ పోటీని తట్టుకోలేక రైతాంగం దివాలా తీస్తోందన్నారు. సొంత భూమి లేని వ్యవసాయ కూలీల సంఖ్య కోట్లకు చేరుతోందనీ, హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు కూడా ఉపాధి లేక కూలీలుగా మారుతున్నారన్నారు. సంవత్సరంలో కేవలం 60 రోజులు మాత్రమే పని దొరుకుతున్న దుస్థితి నెలకొందన్నారు. వ్యవసాయ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న కూలీల బతుకులు బాగుపడాలంటే, వారికి కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన, బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం అణచివేస్తోందని, అడవుల నుండి వారిని వెళ్లగొట్టి కార్పొరేట్లకు అప్పగించే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం, రైతాంగ ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో, త్వరలో జరగనున్న ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా ఈనెల 21న అశ్వారావుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగే ఏఐపీకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కావడిగుండ్ల సర్పంచ్ బాడిస లక్ష్మణరావు, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, పీవైఎల్ మండల కార్యదర్శి కుంజా అర్జున్, కంగాల మంగరాజు, కారం వెంకటేష్, గొంది లక్ష్మణరావు, ధర్ముల రాంబాబు, కారం సీతారాములు, కారం తులసి, గోకినపల్లి గంగ, సున్నం చంద్రకాంత, వాసం పోతురాజు, కొమరం లక్ష్మి, కంగాల భూలక్ష్మి, మడివి శ్రీను, కంగాల వెంకటేష్, కన్నయ్య, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
