గ్యాస్ కొరత ధరల పెరుగుదలపై సీపీఐ రాస్తారోకో
బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల వల్లే గ్యాస్ సంక్షోభం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి
చర్ల : లోకల్ గైడ్ :
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే గ్యాస్ కొరత ఏర్పడి, గ్యాస్ ధరలు పెరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు ఆరోపించారు. గ్యాస్ కొరతను నివారించి సరఫరాను మెరుగుపరచాలని, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చర్ల మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో సోమవారం మెయిన్ రోడ్డుపై సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇరాన్పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే యుద్ధ చర్యలను నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా కల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ బండల తీవ్ర కొరత ఏర్పడి, గ్యాస్ ధరలు ఒక్కసారిగా రూ 60ల వరకు పెరిగాయని తెలిపారు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, హాస్టళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బాధ్యతారహిత విధానాలే కారణమని విమర్శించారు. ఈ రాస్తారోకో నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ, మండల కార్యదర్శి నూప పోతయ్య, సహాయ కార్యదర్శులు కోటి ముత్యాలరావు, చల్లా లక్ష్మీనారాయణ, కోడిరెక్కల రాజారావు, నరసింహారావు, కూసం దుర్గాప్రసాద్, నూప రామురమణ, వెంకటేశ్వర్లు, సాయి, కృష్ణ, ప్రవీణ్, రాజు, తిప్పాపురం సర్పంచ్ నూప సునీత, ఉప సర్పంచ్ కల్లూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
