మల్లూరు గిరిధామం.. భక్తి పారవశ్యం!
ఖమ్మం: లోకల్ గైడ్
సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు
శ్రీలక్ష్మీనరసింహుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు
పాల్గొన్న మంత్రి సీతక్క గారు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు దంపతులు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నారసింహుడికి నీరాజనాలు
చింతామణి జలపాతాల నడుమ, స్వయంభూవుగా వెలసిన హేమాచల నారసింహుడి సన్నిధిలో మంత్రి దంపతులు భక్తిశ్రద్ధలతో గడిపారు. గర్భాలయంలో స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, అర్చనల్లో వారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఈ సందర్భంగా వారు ప్రార్థించారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి, వేద ఆశీర్వచనం పలికారు.
ఈ పర్యటనలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) గారు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన సతీమణి శ్రీలక్ష్మి రెడ్డి దంపతులు కూడా ఆలయానికి చేరుకుని స్వామివారికి నీరాజనాలు అర్పించారు.
పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి పొంగులేటి గారిని చూడటానికి తరలివచ్చిన స్థానిక ప్రజలను, కార్యకర్తలను ఆయన ఎంతో ఆత్మీయంగా పలకరించారు. అడవి బిడ్డల ఆరాధ్య దైవమైన మల్లూరు స్వామి క్షేత్రం.. మంత్రుల రాకతో మరింత కళకళలాడింది.
