పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి):
హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్లో ఏర్పాటు చేసిన రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లాబొరేటరీలను జహీరాబాద్ లోని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్లాంట్ అధిపతి, సీనియర్ జనరల్ మేనేజర్ (తయారీ) అనిల్ కుమార్ మహేంద్రకర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ల్యాబ్ భావనను ప్రశంసిస్తూ, విద్యాభ్యాసాన్ని పారిశ్రామిక అవసరాలతో అనుసంధా నించడం ఎంతో అవసరమన్నారు. గీతం విద్యార్థులకు నిపుణుల ఉపన్యాసాలు, ఆచరణాత్మక శిక్షణ అందించేందుకు మహీంద్రా సంస్థ నుంచి ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను పంపుతామని తెలిపారు. అలాగే విద్యార్థులు తమ ప్లాంట్ను సందర్శించి పరిశ్రమల పని తీరును ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆహ్వానించారు. గీతంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మహేంద్రకర్, గీతం అధ్యాపకు లు తమ ప్లాంట్లో ఫ్యాకల్టీ ఇంటర్న్షిప్ కోసం శిక్షణ పొందడం ద్వారా పరిశ్రమలపై లోతైన అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, కోర్ ఇంజనీరింగ్ మాజీ డీన్ ప్రొఫెసర్ వి.ఆర్.శాస్త్రి, స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి పాల్గొని, ఈ ల్యాబ్ను విద్యార్థులు పరిశోధనలు, ఆవిష్కరణలకు వినియోగించు కోవాలని సూచించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు రోబోటిక్స్, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ తయారీ రంగాలలో ఆచరణాత్మక శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.శ్రీనివాస్, రోబోటిక్స్-ఏఐ లాబొరేటరీ ఇన్ఛార్జి డాక్టర్ ఎ.కిరణ్ కుమార్ సమన్వయం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.