
అశ్వారావుపేట : లోకల్ గైడ్ : జనవరి 21 :
రాజకీయాల్లో పదవులు రావడం, పోవడం సహజం. కానీ, నమ్మిన సిద్ధాంతం కోసం, కష్టకాలంలో కూడా పార్టీ జెండాను భుజానకెత్తుకుని నడిచే నాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన, నిఖార్సైన కాంగ్రెస్ వాది మొగళ్లపు చెన్నకేశవరావు. అశ్వారావుపేట రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసి, మండల పార్టీని అగ్రపథాన నిలిపిన ఘనత ఆయనది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ వెంట ఉంటారు. కానీ, పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, అనేక ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన ధీశాలి చెన్నకేశవరావు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలను తప్పకుండా అమలు చేసిన ఘనత ఆయనది. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన ఉదార స్వభావం వారిది. ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా కేవలం హస్తం గుర్తును నమ్మి ప్రజల పక్షాన నిలిచారు. ఆయన ఒక్కరే కాదు, ఆయన సతీమణి మొగళ్ళపు ఉదయ నాగలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ, మహిళా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ఎంపీటీసీగా విశిష్ట సేవలందించారు. గత జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసి తనదైన పాత్ర పోషించారు. రాజకీయాల్లో ఒక కుటుంబం మొత్తం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం వారి నిబద్ధతకు నిదర్శనం. 2009 ఎన్నికల్లో ఎస్టి రిజర్వేషన్ అయిన సందర్భంలో అన్నీ తానై ఒక మండల నాయకుడైన వగ్గెల మిత్రసేనను అధిష్టానం వద్దకు తీసుకెళ్లి అప్పటి ఫైర్ బ్రాండ్ పార్లమెంట్ సభ్యురాలు రేణుక చౌదరి ఆశీస్సులతో టికెట్ ఇప్పించుకొని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న చరిత్ర మరువ రానిది. రాష్ట్రస్థాయిలో ఎందరో సీనియర్ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి నాయకుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లతో సాన్నిహిత్య సంబంధాలున్నాయి. ఎంతోమంది లీడర్లు వర్గపోరును ప్రోత్సహిస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే సమయంలో కూడా వర్గ పోరును పట్టించుకోకుండా పార్టీ అభివృద్ధికే కృషి చేసిన ఘనత ఆయనది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై అపారమైన నమ్మకంతో, వారి ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఒకానొక సందర్భంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవమానాలకు గురైనా ఆయన తొనకలేదు, బెనకలేదు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు అనే భావనతో, నిజమైన కార్యకర్తల గొంతుకగా నిలబడ్డారు. కష్టకాలంలో నిలబడ్డ వారికే రేపటి విజయంలో ప్రాధాన్యత ఉండాలని ప్రజలు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అశ్వారావుపేట అభివృద్ధి చెందాలన్నా, సామాన్యుడి గొంతు వినిపించాలన్నా చెన్నకేశవరావు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడికి తగిన ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉంది. ఆయన నాయకత్వంలో మండల పార్టీ ఎన్నో విజయాలను చూసింది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టనష్టాలను తెలుసుకునే గుణం ఆయనను 'ప్రజా నాయకుడిని' చేసింది. అశ్వారావుపేట కాంగ్రెస్ కోటను కాపాడుకోవాలన్నా, మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించాలన్నా సున్నిత మనస్తత్వం, నిరాడంబరత, కాంగ్రెస్ పార్టీ ఎడల అంకిత భావం గల మొగళ్లపు చెన్నకేశవరావు నాయకత్వం అత్యవసరమని ప్రజలు భావిస్తున్నారు.