ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని వేగవంతం చేయాలి
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లాలో 61.25 శాతం ప్రక్రియ పూర్తి : కలెక్టర్ అంకిత్
భద్రాద్రికొత్తగూడెం, లోకల్ గైడ్ :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎస్ఎస్ఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఏజెంట్ల నియామకాన్ని పూర్తి చేయాలన్నారు. ఇంకా సమావేశాలు జరగని చోట వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటరు వివరాల మ్యాపింగ్లో తప్పులు దొర్లకుండా అధికారులు సంబంధిత యాప్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే 61.25 శాతానికి చేరుకుందని వివరించారు. మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, జిల్లాలో ప్రక్రియ అత్యంత ఖచ్చితత్వంతో సాగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
