పట్టాలు ఉన్నా కూలగొట్టారు. బి సి మహిళ ఇంటిపై బహిరంగ దౌర్జన్యం.
వ్యక్తిగత కక్షతో గజ్జల వెంకన్న అక్రమ రచ్చ
కమిషనర్ను కలసిన అంబేద్కర్ సేవా సంఘం
ఖమ్మం:లోకల్ గైడ్:
ఖమ్మం నగరంలోని 28వ డివిజన్ పరిధిలో గొల్లపాడు ఛానల్ కాలువ కట్టపై నివాసం ఉంటున్న పేద బి సి మహిళ గోగుల సత్యవతి ఇంటిని పూర్తిస్థాయి ప్రభుత్వ పట్టాలు ఉన్నప్పటికీ నిర్ధాక్షిణ్యంగా కూలగొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.వ్యక్తిగత కక్షతో గజ్జల వెంకన్న తన అనుచరులను వెంట తీసుకుని వచ్చి “ఇది రోడ్డు” అంటూ బలవంతంగా ఇంటిని కూలగొట్టించడమే కాకుండా మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవా సంఘం కమిటీ సభ్యులు గురువారం ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ను కలిసి ఘాటుగా ఫిర్యాదు చేశారు.బాధితురాలు గోగుల సత్యవతి భర్త వెంకటేశ్వర్లు పేరిట– 2021లో అప్పటి ఎమ్మార్వో జారీ చేసిన పట్టా,– జీఓ–58 ప్రకారం అప్పటి జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన పట్టా,– మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకం మంజూరు పత్రం,ఉన్నప్పటికీ ఇంటిని కూలగొట్టడం పాలనా వైఫల్యమే కాక నేరమని సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ పట్టాలన్నీ అప్పటి ప్రభుత్వం తరఫున మాజీ మంత్రి సమక్షంలోనే 28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల లక్ష్మి భర్త గజ్జల వెంకన్న చేతుల మీదుగానే అందజేశారని వారు గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు కావా? ఇప్పుడు అదే వ్యక్తికి చట్టం వర్తించదా? అని ప్రశ్నించారు.
ఇల్లు కట్టుకోమని ప్రోత్సహించి, అనంతరం అదే ఇంటిని కూలగొట్టించడం కక్షసాధింపుకి నిదర్శనమని విమర్శించారు. పేద బి సి మహిళను లక్ష్యంగా చేసుకుని ఈ స్థాయి దౌర్జన్యం చేయడం రాజ్యాంగ విలువలకు అవమానమని మండిపడ్డారు.ఇది నిజంగా రోడ్డు అయితే —2021కి ముందు కార్పొరేషన్ కౌన్సిల్లో ఈ స్థలాన్ని రోడ్డు అని తీర్మానం చేసిన రికార్డు ఎక్కడ ఉంది?రోడ్డు వెడల్పు ఎంత?పొడవు ఎంత?
ఎన్ని లక్షల రూపాయలు మంజూరు చేశారు?ఏ సంవత్సరంలో పనులకు అనుమతులు ఇచ్చారు?అనే వివరాలను ప్రజల ముందుంచకుండా “రోడ్డు” పేరిట ఇల్లు కూలగొట్టడం పూర్తిస్థాయి అక్రమమని వారు స్పష్టం చేశారు.2015 ఆర్టీఏ సమాచార హక్కు చట్టం ప్రకారం కమిషనర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి సంబంధిత తీర్మాన పత్రాలను ఇవ్వాలని అధికారికంగా కోరినట్లు తెలిపారు.గజ్జల వెంకన్నపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధిత బిసి మహిళకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అంబేద్కర్ సేవా సంఘం కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. వెంటనే న్యాయ విచారణ జరపకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముందు రోడ్డు నిరసనలు, జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాలమానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీను, మాజీ సర్పంచ్ బొబ్బిలి భరచంద్ర, అంబేద్కర్ సేవా సంఘం వ్యవస్థాపకులు జై భీమ్ నారమళ్ళ, డాక్టర్ ఆరెంపల వీరభద్రం, చింతపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
