ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
చిల్లగుంపులో ఇళ్ల నిర్మాణాల పరిశీలన అధికారులకు కీలక ఆదేశాలు
By Ram Reddy
On
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం దమ్మపేట మండలం, పాల్కలగండి గ్రామ పంచాయతీ పరిధిలోని చిల్లగుంపు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఒక్కో ఇంటిని సందర్శించిన కలెక్టర్, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక, సిమెంట్ వంటి సామగ్రి సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని, పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
*ఆ ఒక్క ఇంటిపై ఆరా*
గ్రామంలో మొత్తం 15 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 14 ఇళ్ల గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన ఒక ఇంటి గ్రౌండింగ్ ప్రక్రియ ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని అధికారులను ప్రశ్నించారు. ఆ ఇంటికి సంబంధించిన సాంకేతిక లేదా ఇతర సమస్యలేవైనా ఉంటే తక్షణమే పరిష్కరించి, వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను కఠినంగా ఆదేశించారు.
*నాణ్యతలో రాజీ పడొద్దు*
ఇళ్ల నిర్మాణం కేవలం వేగంగానే కాకుండా, అత్యంత నాణ్యతతో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని సూచించారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే ఈ కార్యక్రమంలో ఎలాంటి జాప్యం జరగకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుశీల, దమ్మపేట తహశీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి మరియు ఇతర మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
