శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో గల ప్రశాంత్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్య తీవ్రరూపం దాల్చింది. కాలనీలో డ్రైనేజ్ పైప్లైన్ జామ్ కావడంతో మురుగు నీరు రోజూ రోడ్లపై పారుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉంది సంవత్సరానికి 12 నెలలు మురికి నీరు రోడ్లపై పారుతూనే ఉండటంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు విషజ్వరాలు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కాలనీలో నివసించడం చాలా కష్టంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీహరి ఇంటి నంబర్ 2-41/1/1 నుంచి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న డ్రైనేజ్ లైన్ చాలా చిన్నదిగా (ఒక పీట్ పైపు) ఉండటంతో, శ్రీరాంనగర్ ఏ బ్లాక్, పోలీస్ క్యాంప్ (8వ బెటాలియన్), రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్, కొత్తగూడా గ్రామం, సఫారీ నగర్, గోపాల్ రెడ్డి నగర్ తదితర సుమారు ఆరు కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు ఇక్కడే చేరి సమస్య మరింత తీవ్రమవుతోందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కనీసం నాలుగు పీట్ల వెడల్పుతో కొత్త డ్రైనేజ్ పైప్లైన్ వేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు మెయిన్ లైన్ విస్తరించాలని కోరుతున్నారు. ఇప్పటికే 2026 ఫిబ్రవరి 16న ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ, నెలరోజులు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాలనీవాసులు సమస్యకు సంబంధించిన ఫోటోలు కూడా జతపరచినట్లు తెలిపారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పలు కాలనీల మురుగు నీరు ఒకే చిన్న పైప్లో చేరడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వెంటనే సరైన డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయకపోతే వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం అత్యవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుచున్నారు.