జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి.
జూరాల ప్రాజెక్టు బ్రిడ్జితో పాటు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం.
భవిష్యత్తులో గద్వాల, ఆత్మకూరు మరింత అభివృద్ధి.
గద్వాల, లోకల్ గైడ్:
గద్వాల మండల పరిధిలోని కొత్తపల్లి నుండి ఆత్మకూరు వైపు వెళ్లే జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మంగళవారం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పరిశీంచారు. ఈ సందర్బంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. జూరాల ప్రాజెక్ట్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ తో త్వరగా పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకు రావాలని సూచించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. గత సంవత్సరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి జూరాల ప్రాజెక్టు సందర్శన పరిశీలనకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు గద్వాలకు ఆత్మకూరు అనుసంధానంగా జూరాల హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. వెంటనే మంత్రి దీనికి ఆమోదం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. చెప్పిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి 121 కోట్లు రూపాయలు మంజూరు చేయడం, సీఎం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం చాలా సంతోషం అని హర్షం వ్యక్తం చేశారు. ఆత్మకూరు నుండి గద్వాలకు పదినిమిషాల్లో చేరుకుంటారన్నారు. అదేవిధంగా గద్వాల నుండి హైదరాబాదు వెళ్లే వారికి 35 కిలోమీటర్ వరకు రవాణా సౌకర్యం తగ్గుతుందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం తరుణంలోనే ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేయాలని ఆలోచించడం జరిగిందని తెలిపారు. ఈ ఫోర్ లైన్ నిర్మాణం చేయడం వల్ల గద్వాల నుండి ఆత్మకూర్ మక్తల్, మంత్రాలయం, బళ్లారి వరకు వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు లో నీటి నిలువ చేసేందుకు చెక్ డాంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి నెమలి చెరువు నామకరణం చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కొత్తపల్లి మహేశ్వర్ రెడ్డి నివాసంలో మంత్రి, ఎమ్మెల్యేలు టిఫిన్ చేసి తేనెటీ విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, సర్పంచ్ సుజాత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
