హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మబలిదానాలు చేసిన విద్యార్థుల త్యాగాలను ప్రపంచానికి తెలియజేయడం లో, పాలకుల కళ్లు తెరిపించ డంలో దరువు సాంస్కృతిక వేదిక చేసిన కృషి అభినంద నీయమని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అన్నారు. ఉత్తమ సాహిత్యం, ఆలోచింపజేసే పాటల ద్వారా తెలంగాణ సమాజంలో ఉద్యమ చైతన్యం కలిగించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు. దరువు సాంస్కృతిక సంస్థ 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏప్రిల్లో నిర్వహించనున్న దరువు జాతర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విరాహత్ అలీ మాట్లాడుతూ..ఇరవై ఐదేళ్ల క్రితం పోరాటాల గడ్డ అయిన సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిర్భవించిన దరువు సంస్థ, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలోని అనేక విశ్వవిద్యాలయాలలో వేలాది మంది విద్యార్థులలో ఉద్యమ చైతన్యం నింపి, లక్షలాది మంది ప్రజల ఆదరణ పొందిందని తెలిపారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దరువు ఎల్లన్న మాట్లాడుతూ..దరువు సాంస్కృతిక వేదికకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా “దరువు జాతర” పేరిట ఏప్రిల్ 20న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో భారీ సాంస్కృతిక సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సంస్థ అధ్యక్షుడు దరువు అంజన్న మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి పలువురు కళాకారులు, ఉద్యమకారులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దరువు సంస్థ ప్రతినిధులు దుర్గం భాస్కర్, వరంగల్ రవి, దరువు రమేష్, తిరుమల, అందె కృష్ణ, కిందిపాక యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.