శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ
కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిధిలోని సీఆర్ రావు ఎఐఎంఎస్ ప్రాంగణంలో జరిగిన 60 ల్యాప్టాప్ల దొంగతనం కేసును గచ్చిబౌలి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, దొంగిలించిన మొత్తం 60 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె.బాలరాజు తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్లు 331(4), 305(ఎ) కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కూకట్పల్లి ప్రాంతానికి చెందిన రెగుల చంద్ర శేఖర్ (30), అలాగే బీటెక్ విద్యార్థులు చెరుకూరి సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19)లను అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. నిందితులు రాత్రి సమయంలో అక్రమంగా ప్రాంగణంలోకి ప్రవేశించి 60 ల్యాప్టాప్లను అపహరించి నట్లు విచారణలో వెల్లడైంది. ఆదివారం గౌలిదొడ్డి ప్రాంతంలోని నెక్స్ జెన్ హాస్టల్ సమీపంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి దొంగిలించిన 60 ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, అలాగే నేరానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి. నరేష్ దర్యాప్తు చేయగా, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె. బాలరాజు మార్గదర్శకత్వంలో ఏసీపీ జి.వెంకట రమణ గౌడ్, అదనపు డీసీపీ ఎన్.ఉదయ్ రెడ్డి, డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.