నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 1. (లోకల్ గైడ్)
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడ్డాయి.మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గత 24 గంటలుగా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడ రూరల్ సీఐతో పాటు నలుగురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో భారీ వాహనాలు అయిన లారీలు, కంటైనర్లు, ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని డ్రైవర్లకు బ్రెతలైజర్ పరీక్షలు నిర్వహించారు.మొత్తం 3,150 మంది డ్రైవర్లను తనిఖీ చేయగా, వారిలో 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, వారి వాహనాలను సీజ్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా డిఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం జిల్లాలో నిరంతరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.భారీ వాహనాల డ్రైవర్లు దీర్ఘకాల ప్రయాణాలు చేసే సమయంలో మద్యం సేవించడం ప్రమాదాలకు దారితీస్తుందని, ఇది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో రోడ్డు భద్రత పట్ల పోలీసులు కట్టుబడి ఉన్నారని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.