ఇంటర్మీడియట్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి –
తెలంగాణ ఆర్టీఐ మరియు మానవ హక్కుల సంఘం విజ్ఞప్తి ధారా మౌనిక
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, మానసిక భారాన్ని తగ్గించడానికి తెలంగాణ ఆర్టీఐ మరియు మానవ హక్కుల కార్యకర్తల సంఘం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. విద్యార్థుల శ్రేయస్సు, భద్రతను కాపాడటమే కాకుండా, సురక్షితమైన విద్యా వాతావరణం ఏర్పరచడమే తమ లక్ష్యమని సంఘం ప్రతినిధులు తెలిపారు.సంఘం విడుదల చేసిన విజ్ఞప్తి పత్రంలో, విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో “ఒత్తిడి లేని నిర్వహణ మండళ్లు” ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాలని సూచించారు. వీటి ద్వారా విద్యార్థుల కోసం సలహా కార్యక్రమాలు మరియు తల్లిదండ్రుల మార్గదర్శక సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఉచిత బస్సు సేవలు అందించాలనీ, విద్యార్థి గుర్తింపు కార్డు ఆధారంగా రవాణా సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు. దీని వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కూడా సులభంగా కళాశాలలు చేరుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
ట్రాఫిక్ సమస్యల నివారణలో భాగంగా కళాశాల ఆవరణలో ప్రైవేట్ వాహనాల ప్రవేశంపై నిషేధం, పార్కింగ్ నిషేధం, హార్న్ నిషేధ ప్రాంతాల గుర్తింపు, అలాగే వాహన రహిత ప్రాంతాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని విజ్ఞప్తి చేశారు.సంఘం ప్రతినిధులు తమ ప్రకటనలో, “విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గి, సురక్షితమైన, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం ఏర్పడేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రతి విద్యార్థి శ్రేయస్సు, భద్రత రాష్ట్రానికి ప్రాధాన్యత కావాలి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ - చైర్మన్ దారా మౌనిక - అధ్యక్షురాలు వెంకట్ నరసింహ రెడ్డి - జనరల్ సెక్రటరీసాయి ప్రసాద్ రావు - అవేర్నెస్ ప్రోగ్రాం ఇన్చార్జి ,శ్రీనివాస్ - లీగల్ అడ్వైసర్ సాయి వెంకట్ రావు - కో- ఆర్డినేటర్ ,ప్రేమ్ కుమార్ - మెంబర్ తదితరులు పాల్గొన్నారు
