మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని,అదేవిధంగా కార్ల యజమానులు డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని ఎఎస్పి చిత్తరంజన్ కోరారు.సోమవారం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలోని జైత్వాన్ బుద్ధ విహార్లో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఏఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బెండార గ్రామానికి చెందిన నాగోషే పెంటు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ద్విచక్ర వాహనదారులకు 25హెల్మెట్లు పంపిణీ చేశారు.అదేవిధంగా మృతుడి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతు ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణనష్టం జరుగుతోందని పేర్కొన్నారు.ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి,రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తు తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.అదేవిధంగా రాష్ డ్రైవింగ్ చేయడం,మద్యం సేవించి వాహనాలు నడపడం,రాంగ్ రూట్లో వాహనాలు నడపడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.వాహనదారులు అందరు తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వాంకిడి సిఐ సత్యనారాయణ,వాంకిడి ఎస్ఐ మహేందర్ సిబ్బంది పాల్గొన్నారు.