196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్, సాధారణ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఖమ్మం, మార్చి -18:లోకల్ గైడ్ :
----------------------------
196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* హైదరాబాద్ తర్వాత అత్యంత ముఖ్యమైన కార్పోరేషన్ ఖమ్మం మాత్రమేనని అన్నారు. 196 కోట్లతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని, ఈ నిధులతో నగరవాసులకు మెరుగైన సేవలు అందాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
కార్పోరేషన్ లో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మంచి సంస్కరణలు తీసుకొని వచ్చి చాలా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించి నందుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. కార్పోరేషన్ ప్రతి రోజు పని ఉంటుందని, చెత్త సేకరణ, డ్రైయిన్ క్లీన్ చేయడం, స్ట్రీట్ లైట్ నిర్వహణ, నీటి సరఫరా వంటి పనులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని అన్నారు.
నగరం పరిధిలో ఉన్న స్ట్రీట్ లైట్ మానిటరింగ్ కోసం సెంటర్ సిస్టం ఏర్పాటు చేశామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం కాని పక్షంలో సంబంధిత లబ్ధిదారుల నుంచి లెటర్ తీసుకొని అర్హులైన ఇతర లబ్ధిదారులకు కేటాయింపులు జరిగేలా ఏఈ హౌసింగ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతి ఆధారంగా ఎప్పటికప్పుడు బిల్లులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏప్రిల్ మొదటి వారం నాటికి ఖమ్మం జిల్లా పరిధిలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి అవుతాయని కలెక్టర్ తెలిపారు.
43వ డివిజన్ పరిధిలో చేపట్టిన విధంగా కార్పొరేషన్ వ్యాప్తంగా ఆస్తుల విలువలు మరొక్కసారి పరిశీలించి ఆస్తి పన్ను సవరించాలని కలెక్టర్ సూచించారు. నగరంలో ఉన్న భవనాలు, ఇతర నిర్మాణాలను మరొక్కసారి పునః పరిశీలించి వసూలు చేయాల్సిన ఆస్తి పన్ను సవరించాలని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సొంత ఆదాయాలను పెంచుకోవడంపై దృష్టి సారించాలని అన్నారు. నగరంలో డార్క్ ఏరియా గమనించి ఎక్కడ చీకట్లు ఉండకుండా స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వీధి దీపాల మరమ్మత్తు పనులు ఎప్పటికప్పుడు వెంటనే జరిగేలా చూడాలని అన్నారు. విలీన ప్రాంతంలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.
నగరంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టవచ్చని అన్నారు. నీటి కనెక్షన్ ఇతర పనుల కోసం రోడ్ల తవ్వకాలు చేపట్టినప్పుడు వాటి మరమ్మత్తుకు కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
వివిధ అభివృద్ధి పనుల కోసం రోడ్ల తవ్వకాలు చేపట్టినప్పుడు మళ్లీ పూర్వపు స్థితికి రోడ్డును తీసుకువచ్చే బాధ్యత తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న గుంతలను పూడ్చి వేసినందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు పూర్తి చేశామని అన్నారు.
నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ అధికంగా జరుగుతుందని, దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున సాంకేతికత ఆధారంగా వీటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ను గుర్తించి జరిమానాలు వెంటనే విధించేలా చూడాలని అన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అమృత్ పథకం ద్వారా త్రాగునీటి సరఫరా పనులు, ఎస్.టి.పి. నిర్మాణం , ఖమ్మం ఖిల్లాకు రోప్ వే వంటి అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేసేందుకు రెవెన్యూ శాఖ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. డంప్ యార్డ్ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమావేశంలో *నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ*, నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కార్పొరేటర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.
బడ్జెట్ 2026-27 అంచనాలను సభకు నగరపాలక సంస్థ పరిపాలన అధికారి సిహెచ్. శ్రీనివాస్ వివరించారు. పన్నుల వనరుల క్రింద 50.43 కోట్లు, పన్నేతర వనరుల ద్వారా 96.94 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్ ల ద్వారా 7.90 కోట్లు, మొత్తంగా 104.84 కోట్ల ఆదాయ అంచనా ఉందన్నారు.
ఖర్చుల క్రింద చార్జ్డ్ ఖర్చులు 63.44 కోట్లు, నిర్వహణ ఖర్చులు 18.03 కోట్లు, విలీన గ్రామాలు, పబ్లిక్ ఏమిటెన్స్, వార్డ్ బడ్జెట్ క్రింద 16.01 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్ లు, రుణాల క్రింద 7.90 కోట్లు, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్స్ క్రింద 91.02 కోట్లు గా అంచనా వేశారు.
సాధారణ కౌన్సిల్ సమావేశంలో 4రూ. 74.09 కోట్లకు సంబంధించి 22 అంశాలను కౌన్సిల్ ఆమోదం కొరకు నగరపాలక సంస్థ మేనేజర్ జి. శ్రీనివాసరావు సమర్పించారు. ఇందులో 984 మంది అవుట్ సోర్సింగ్ వర్కర్ల వేతనం మునిసిపల్ సాధారణ నిధుల నుండి మంజూరుకు, 20 మంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది వేతనములు మునిసిపల్ సాధారణ నిధుల నుండి మంజూరుకు ఇద్దరు మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గౌరవ వేతనం మంజూరుకు, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్స్ వేతనాలు మంజూరుకు, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ గౌరవ వేతనం మునిసిపల్ సాధారణ నిధుల నుండి మంజూరుకు, ఒక తహసీల్దార్S సేవలు ఔట్ సోర్సింగ్ పద్దతిపై వినియోగించుకొనుటకు, పారిశుద్ధ్య, మల్టిపర్పస్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున ప్రస్తుత వేతనానికి అదనంగా చెల్లించుటకు, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన ఔట్ సోర్సింగ్ కార్మికుడు మల్లెపాక శివకుమార్ కుటుంబానికి పరిహారం క్రింద 2 లక్షలు చెల్లింపులు ఉన్నాయి.
సమావేశంలో కార్పొరేటర్లు తీగల వంతెన నిర్మాణం ద్వారా షాపులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. సంక్షేమ పథకాల శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలకు ప్రతిపక్ష కార్పొరేటర్లను పిలవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న వారి విడతల వారి విచారణ త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. నగరంలో ఇఎస్ఐ ఆసుపత్రి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని, జిపిఎస్ ద్వారా పన్నుల అసెస్మెంట్ చేయాలని అన్నారు. పబ్లిక్ తాయిలెట్ల నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. సిసి రోడ్ల నిర్మాణం తర్వాత సైడ్ మట్టి పనులు చేయట్లేదని, దీనితో ప్రమాదాలు జరుగుతున్నాయని, సదరు కాంట్రాక్టర్ తో పనులు పూర్తి చేయించాలన్నారు. కరంట్ పోల్ వేసేప్పుడు సమాచారం ఇవ్వాలని, సంబంధిత అధికారులు సమన్వయం చేయాలని తెలిపారు. నగరంలో పెయిడ్ పార్కింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. తమ తమ డివిజన్లలో సమస్యలను ఈ సందర్భంగా కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తెచ్చారు. త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
