తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు – చర్ల యువకుడికి గౌరవం
చర్ల : లోకల్ గైడ్ :
అద్భుత కళా ప్రస్థానం
జీ లక్ష్మణ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సుమారు 60 మంది సినీ, రాజకీయ ప్రముఖుల గళాలను అనుకరించే మిమిక్రీ కళలో ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. 2003లో కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన యువజనోత్సవాల్లో మిమిక్రీ ప్రదర్శన చేసి, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నారు.
కళాకారుడిగానే కాకుండా కవిగా కూడా ఆయన ప్రతిభ చాటుకున్నారు. 300కు పైగా పాటలు, 1000కు పైగా కవితలు రచించారు.
ప్రఖ్యాత వేదికలపై ప్రదర్శనలు
హైదరాబాద్లోని రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభ (చిక్కడపల్లి), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, విజయవాడ, ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం, ప్రసాద్ కలర్ ల్యాబ్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై వందలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
విద్యావేత్తగా, జర్నలిస్టుగా రాణింపు
జీ లక్ష్మణ్ కుమార్ ఎం.ఏ (తెలుగు), ఎం.ఏ (పాలిటికల్ సైన్స్), బి.ఎడ్, ఎల్.ఎల్.బి వంటి ఉన్నత విద్యలను పూర్తిచేశారు. ప్రస్తుతం ఒక కళాశాలకు ప్రిన్సిపాల్గా సేవలందిస్తున్నారు. సామాజిక స్పృహతో జర్నలిస్టుగా కూడా తన కలం, గళాన్ని వినిపిస్తున్నారు.
నటన, షార్ట్ ఫిల్మ్ రంగంలో ప్రతిభ
పాఠశాల దశ నుంచే నాటక రంగంలో ప్రవేశించిన లక్ష్మణ్ కుమార్, 2022లో ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ యువజనోత్సవాల్లో భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున పాల్గొని జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు.
2018లో ఏలూరులో నిర్వహించిన “చిన్న సినిమా – పెద్ద సందేశం” షార్ట్ ఫిల్మ్ పోటీల్లో 8 రాష్ట్రాల నుండి వచ్చిన 80 చిత్రాల మధ్య “ఒంటరి వ్యసనం” చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
అదేవిధంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్వహించిన బతుకమ్మ ఫిల్మ్ ఫెస్టివల్–2025లో చర్ల మండలంలోని ఆదివాసీలతో కలిసి “అధికర్మయోగి” షార్ట్ ఫిల్మ్ నిర్మించి సినీ ప్రముఖుల ప్రశంసలు పొందారు.
కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మణ్ కుమార్
ఈ సందర్భంగా జీ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, తనను రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్గా నియమించినందుకు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్ (సీఈఓ), జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి యశోభూషణంకు కృతజ్ఞతలు తెలిపారు. 9 దేశాల్లో 15,000 మందికి పైగా సభ్యులతో విస్తరించిన ఈ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి, తెలంగాణ కళాకారుల గుర్తింపుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
