ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
రెవెన్యూ-ఫారెస్ట్ ఫైటింగ్లో నలిగిపోతున్న ఆదివాసి బిడ్డలు
రామన్నగూడెం భూపోరాటంపై ప్రత్యేక కథనం
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
ఓట్ల సమయంలో వస్తారు, కాళ్ళ వేళ్ళ పడతారు. తీరా గెలిచాక మా మొహం చూసే నాథుడే లేడు అని రామన్నగూడెం గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు, ప్రభుత్వాలు మారాయి. కానీ ఆదివాసీల భూ సమస్య మాత్రం మ్యాపుల మధ్యే నలుగుతోంది. ప్రజాప్రతినిధుల హామీలు కేవలం ఎన్నికల స్టంట్లుగానే మిగిలిపోయాయని, తమను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని వారు మండిపడుతున్నారు. పోలీసు లాఠీలు, అధికారుల వేధింపులు, తమ హక్కుల కోసం గొంతెత్తితే ఎదురయ్యేది పోలీసు కేసులు, ఫారెస్ట్ అధికారుల బెదిరింపులేనని గిరిజనులు వాపోతున్నారు. అభివృద్ధికి వందేళ్ల దూరంలో నెట్టబడిన ఈ గ్రామం, నిత్యం గొడవలు, ఆందోళనలతోనే కాలం వెళ్లదీస్తోంది. పచ్చని పంటలు పండించాల్సిన చేతులు, నేడు జిల్లా కార్యాలయం ముందు నిరసన ప్లకార్డులు పట్టుకోవడం వ్యవస్థా లోపానికి నిదర్శనం. నిమ్మకు నీరెత్తినట్లు యంత్రాంగంఉంది. వరుసగా ఆరో రోజు దీక్ష కొనసాగుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చీమ కుట్టినట్లయినా లేదు అన్న ఆదివాసీల మాట వారిలోని తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఆదివాసీల పట్టా భూములను తక్షణమే వారికి అప్పగించాలని,దశాబ్దాల నిర్లక్ష్యానికి చరమగీతం పాడి, ఆ గ్రామానికి సామాజిక న్యాయం చేయాలని, రామన్నగూడెం ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటానికి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, రాజకీయ పార్టీలు మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ ఆకలి కేకలు శాంతి భద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం మేల్కొనాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు హెచ్చరిస్తున్నారు.
