ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలి....
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం: లోకల్ గైడ్)
ఆసుపత్రిలో అర్థరాత్రి వెళ్ళినా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కల్పించాలి
పాలేరు నియోజకవర్గంలో రెండు 100 పడకల ఆసుపత్రుల నిర్మా
తిరుమలాయపాలెంలో పర్యటించి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన మంత్రి పొంగులేటి
తిరుమలాయపాలెం, మార్
ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్యం పట్ల ప్రజలలో నమ్మకం కలిగించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం తిరుమలాయపాలెంలో పర్యటించి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి సుమారు 26 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 39 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* మండల కేంద్రంలో 26 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు. గిరిజనులు అధికంగా ఉండే ఈ మండలం లో ఎటువంటి అత్యవసర వైద్య సహాయానికి అయినా ఖమ్మం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసవాలకు అవసరమైన వసతులు కల్పించి స్టాఫ్ నియామకం చేశామని అన్నారు.
100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత జిల్లా ఆసుపత్రిని మరిపించే విధంగా అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, ఆసుపత్రిలో వైద్యులు అర్థ రాత్రి వెళ్ళినా అందుబాటులో ఉంటారనీ నమ్మకం కల్పించాలని అన్నారు.
వైద్యులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, ఇటీవలే ఇల్లెందు, చర్ల , పినపాక పర్యటనలో ప్రభుత్వ ఆసుపత్రులు పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగిందని, అక్కడ సిబ్బంది మంచి పని తీరుతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని అన్నారు. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో ఆసుపత్రి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వైద్యులు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే వైద్య సిబ్బందికి ప్రత్యేక బహుమతులు పాలేరు నియోజకవర్గంలో అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాలేరు నియోజక వర్గ పరిధిలో రెండు 100 పడకల ఆసుపత్రులను నిర్మించడంతోనే వైద్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తుందని అన్నారు.
డిసెంబర్ 2026 నాటికి 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి కావాలని, వైద్య శాఖలో పనిచేసే సిబ్బంది తిరుమలాయపాలెం హెడ్ క్వార్టర్ లో నివసించాలని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఆసుపత్రులను నిరంతరం తనిఖీ చేస్తూ, వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తిరుమలాయపాలెంలో ఉన్న 30 పడకల ఆసుపత్రినీ 100 పడకలకు విస్తరిస్తున్నామని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్ల ఖమ్మం ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. 6 నెలల నుంచి ఇక్కడ ప్రసవాలు కూడా పెరుగుతున్నాయని అదనపు కలెక్టర్ తెలిపారు.
అనంతరం 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, డి.సి.హెచ్.ఎస్. డా. రాజశేఖర్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, డిప్యూటీ డి.ఎం.అండ్.హెచ్.ఓ. డా. చందు నాయక్, హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్య శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు, ఎంపీడీఓ సిలాబ్ సాహెబు, తహసిల్దార్ విల్సన్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
