కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలి
లేదంటే ‘ఛలో బల్దియా’ పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరిక
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో శాస్త్రీయత పూర్తిగా లోపించిందని పఠాన్ చేరు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఒక లక్ష 20 వేల ఓటర్లు, సుమారు మూడు లక్షల జనాభా కలిగిన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. వెంటనే అమీన్పూర్ పరిధిలో మరో రెండు నూతన డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కిష్టారెడ్డి పేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేట గ్రామంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పరిపాలనా సౌలభ్యం పేరుతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సర్వేలు నిర్వహించకుండా కేవలం గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లను నిర్ణయించడం అన్యాయమని విమర్శించారు. పఠాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి మొత్తం ఆరు డివిజన్లు ఏర్పాటు చేసినప్పటికీ, అమీన్పూర్కు తగిన న్యాయం జరగలేదన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సమగ్ర అభివృద్ధి జరగాలంటే ప్రతి 25 వేల నుంచి 30 వేల ఓటర్లకు ఒక డివిజన్ ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, బల్దియా కమిషనర్కు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మరో రెండు డివిజన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో వేలాది మందితో కలిసి హైదరాబాద్లోని బల్దియా ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంక్రాంతి అనంతరం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అఖిలపక్ష బృందం సభ్యులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
