సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా పోలీసులు సరికొత్త వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. యూరప్ దేశాలలో విజయవంతంగా అమలవు తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని సైబరాబాద్లో ప్రవేశపెట్టే అవకాశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలిలోని పీఎస్ఐఓసీ, ఎస్సీఎస్సీ సమావేశ మందిరంలో సీపీ డాక్టర్ ఎం.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్విట్జర్లాండ్కు చెందిన ట్రాన్స్ స్కాలిటీ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిష్కారాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందుగానే రద్దీ అంచనా ఏఐ సాంకేతికత ద్వారా నగరంలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి, ఎక్కడ రద్దీ ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించ వచ్చని తెలిపారు. ఈ వ్యవస్థ సిగ్నల్లను స్వయంచాలకంగా నియంత్రించి వాహనాల రాకపోకలను సమర్థవంతంగా నిర్వహించగలదని వివరించారు. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు."రోడ్డు భద్రతే లక్ష్యం" నగరంలో అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని సీపీ అధికారులను ఆదేశించారు. ఆధునిక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ టెక్నాలజీల వినియోగం వల్ల రోడ్డు భద్రత మెరుగుపడటంతో పాటు పోలీసు సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు టి.అన్నపూర్ణ, ఐ. రంజన్ రతన్ కుమార్, ఏడీసీపీ హనుమంతరావు, ఎస్సీఎస్సీ సీఈఓ నవేద్, ఆస్కి (ఏఎస్ సీఐ) ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.