సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆతిథ్య మిస్తున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీపీ డాక్టర్ ఎం.రమేష్ తెలిపారు. క్రీడలకు సంబంధించిన వసతి, భోజనం, రవాణా, భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు. రాష్ట్రంలోని 3 కమిషనరేట్లు, 7 జోన్లు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, రైల్వే పోలీస్, టీఎస్ఎస్పీ బెటాలియన్ల నుంచి మొత్తం 2,532 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో 1,933 మంది పురుషులు, 599 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. మొత్తం 31 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఫుట్బాల్, హాకీ, స్విమ్మింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, యోగా తదితర విభాగాలలో పోటీలు జరుగనున్నాయి. క్రీడాకారులకు తెలంగాణ పోలీస్ అకాడమీ లోని బ్లాకులలో 806 పడకల వసతి, పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు కల్పించారు. ఫిబ్రవరి 18న సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభోత్సవం జరుగుతుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, దుర్గం చెరువు, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం తదితర వేదికలలో పోటీలు నిర్వహించ నున్నారు. ఫిబ్రవరి 20న ‘బడా ఖానా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్రీడాకారుల సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని నోడల్ అధికారులకు సీపీ ఆదేశించారు. ఈ క్రీడలు పోలీసు సిబ్బందిలో ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు వృత్తి ఒత్తిడికి ఉపశమనం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.