అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
భూమి సమస్యలతో అభివృద్ధి పనులు ఆలస్యం కాకూడదని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
కొత్తగూడెం : లోకల్ గైడ్ :
జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా అమలుకావాలంటే అవసరమైన భూమి కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో భూమి కేటాయింపు, భూమి అవసరాల అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల పరిధిలో అమలులో ఉన్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా మంజూరైన పనుల వివరాలు, వాటి ప్రస్తుత పురోగతి, ఎప్పుడు మంజూరు అయ్యాయి, ఇప్పటివరకు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అలాగే ఏ పథకం కింద పనులకు మంజూరు లభించింది, పనుల అమలుకు ఎంత భూమి అవసరం ఉంది, భూమి కేటాయింపులో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, అటవీ భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా అనే అంశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి పనులు భూమి సమస్యల కారణంగా ఆలస్యం కాకుండా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన భూమి గుర్తింపు, కేటాయింపు ప్రక్రియలను వేగవంతం చేసి పనులు త్వరగా ప్రారంభం కావడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
భూమి కేటాయింపుకు సంబంధించిన ప్రతిపాదనలను పూర్తి వివరాలతో సమర్పించి, పెండింగ్లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శాఖలు తమ పరిధిలో అమలులో ఉన్న పనులపై సమగ్ర సమాచారం సేకరించి, మంజూరైన పనులు, వాటి పురోగతి, భూమి అవసరాలు, పెండింగ్కు కారణాలు వంటి అంశాలను వివరంగా పొందుపరుస్తూ నివేదికలను సిద్ధం చేసి జిల్లా పరిపాలనకు అందజేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు త్వరగా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, బీసీ సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, నీటిపారుదల శాఖ ఈఈ అర్జున్ రావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇల్లందు, అశ్వరావుపేట, మణుగూరు మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి సుధీర్, విద్యుత్, వ్యవసాయ, అటవీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
