కూకట్ పల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
నగరంలోని కూకట్ పల్లి పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్థానిక అపార్ట్మెంట్లో నివసిస్తున్న శైలజ (43) అనారోగ్యంతో మృతి చెందింది. అయితే ఆమెను దేవుడు మళ్లీ బతికిస్తాడనే మూఢనమ్మకంతో కుటుంబ సభ్యులు మృత దేహాన్ని నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. మృతురాలి తల్లి శమంతకమణి, తోబుట్టు వులు జయరాం, సునీతలు ఏసుప్రభువు తిరిగి ప్రాణం పోస్తాడనే నమ్మకంతో అంత్యక్రియలు నిర్వహించ కుండా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు తెలిసింది. నాలుగు రోజుల తరువాత అపార్ట్మెంట్ లో దుర్వాసన రావడంతో స్థానికులు విషయాన్ని గమనించి అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అయితే ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కైకలూరుకు తరలించారు. ఈ ఘటన సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢ నమ్మకాల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. వైద్యపరంగా మరణం నిర్ధారణ అయిన తరువాత కూడా తిరిగి జీవితం పొందుతారనే నమ్మకం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. ఇటువంటి సంఘటనలు ప్రజలలో అవగాహన లోపాన్ని సూచిస్తున్నాయి. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవే అయినప్పటికీ, చట్టపరమైన, ప్రజారోగ్య పరమైన అంశాలను విస్మరించడం సమాజానికి ఇబ్బందులు కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, మూఢ నమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అవసరం. పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.