ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ని దర్శించుకున్న మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు ..
హనుమకొండ జిల్లా ప్రతినిధి
జనవరి 14(లోకల్ గైడ్ న్యూస్) భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రివర్ కొండ సురేఖ తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వామివారిని దర్శించుకున్నారు..
తొలుత బ్రహ్మోత్సవాలకు మంత్రి సురేఖ కి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు..ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి కొండ సురేఖ కి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందించి, తీర్థ–ప్రసాదాలు అందజేశారు...
తదనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రి, ఎమ్మెల్యే, పరిశీలించారు. భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు...
అదేవిధంగా ఐనవోలు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన బస్, బస్టాండ్ ను ప్రారంభించి బస్సులో ప్రయాణించిన మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాగరాజు..ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ…
భోగి పర్వదినం సందర్భంగా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ,
భోగి పర్వదినం సందర్భంగా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తనకు అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన శైవక్షేత్రమని పేర్కొన్నారు..
బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. భక్తుల సౌకర్యాల దృష్ట్యా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత మరింత మెరుగుపర్చాలని అధికారులను కోరారు..
భోగి పండుగ రైతులకు, ప్రజలకు పాత కష్టాలను విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుభిక్షం కలగాలని, అలాగే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి కృపతో వర్ధన్నపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు...
ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆలయ ఈవో సుధాకర్, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
