లోకల్ గైడ్/బంట్వారం:
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (బీవీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో “హలో వికలాంగ – చలో కొడంగల్” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యంలో, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములను బంట్వారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.సంస్థ ప్రతినిధుల వివరాల ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించగా, దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టినట్లు ఆరోపించారు.ఈ సందర్భంగా కావలి నర్సిములు మాట్లాడుతూ, అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. “ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా కార్యక్రమం కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని, ఇచ్చిన హామీల అమలు విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.