లోకల్ గైడ్/ తాండూర్:
ఓ వివాహితకు ఇల్లు లేదు ఇంటికి మీటరూ లేదు, కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వాడినట్లు కరపత్రం అందజేసిన వింత ఘటన పెద్దేముల్ మండలంలో మంగళవారం వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి గ్రామానికి చెందిన అరిగే పద్మమ్మకు సొంత ఇల్లు లేదు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం ఇదితమే. ఈ నేపథ్యంలో గత రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే 200 యూనిట్ల విద్యుత్తు వాడుతున్నారో, అలాంటి వాళ్లకు ప్రభుత్వం సంక్రాంతి పండుగ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఓ కరపత్రం విడుదల చేశారు. ఈ పత్రాన్ని విద్యుత్ శాఖ అధికారులు నియోజకవర్గ పరిధిలోని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వాడిన వినియోదారులకు సర్వీస్ నెంబర్ ఆధారంగా కరపత్రాలను పంపిణీ చేశారు. అయితే పద్మమ్మకు సొంత ఇల్లు, మీటర్ ఏమీ లేవు. అయినా కూడా ఆమె పేరు మీద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వినియోగించినట్లు తన పేరుమీద కరపత్రం అందించినట్లు ఆమె తెలిపారు. అసలు మీటరే లేనప్పుడు తన పేర కరపత్రం ఎలా ముద్రిస్తారని బాధితురాలు విస్మయం వ్యక్తం చేశారు.