శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలలో బీసీలకు కనీసం రెండు సీట్లు కేటాయించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా రెండు స్థానాలను ఓసీలకు కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో సుమారు 56 శాతం జనాభా ఉన్న బీసీలకు చట్టసభలలో కనీసం 15 శాతం సీట్లు కూడా దక్కడం లేదన్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలను బీసీ నాయకులకు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ ప్రకటించ బోయే రాజ్యసభ అభ్యర్థులలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమర్థవంతమైన ఇద్దరు బీసీ నాయకులను ఎంపిక చేసి రాజ్యసభకు పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం తన సామాజిక న్యాయ వైఖరిని ప్రజలకు స్పష్టంగా తెలియజేసినట్ల వుతుందని అన్నారు. బీసీలకు రాజ్యసభలో రెండు స్థానాలు కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భేరి రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.