ఖమ్మం జిల్లా,కారేపల్లి : లోకల్ గైడ్, జనవరి 27 :
కారేపల్లి మండలం పొలంపల్లి పంచాయతీకీ చెందిన బానోత్ దశరథ్కు ఉత్తమ సైనికుడిగా అవార్డు లభించింది. గత 17 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తున్న దశరథ్ విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, ధైర్యసాహసాలు, దేశభక్తికి గుర్తింపుగా ఆయనకు ఉత్తమ సైనికుడిగా అవార్డు కైవసం చేసుకున్నాడు . జమ్మూ, కశ్మీర్లోని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తూ దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాద శక్తులపై జరిగిన అనేక కీలక ఆపరేషన్లలో దశరథ్ పాల్గొన్నాడు. ప్రస్తుతం సియాచిన్ ప్రాంత సమీపంలోని చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. దశరథ్ తల్లిదండ్రులు, భార్య జమున, పిల్లలు సోహాన్ వీర్, శ్రీనిధి పొలంపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. దశరథ్కు ఉత్తమ సైనికుడిగా అవార్డు దక్కడంపై గ్రామ సర్పంచ్ హేమలత బాలాజీ, ఉపసర్పంచ్ గుగులోత్ సర్వన్, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ దశరథ్ కు అభినందనలు తెలిపారు.