సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
ఐటీ కారిడార్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సర్వే నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ వద్ద మార్నింగ్ పీక్ అవర్లో చేపట్టిన సర్వేలో కీలక అంశాలు బయటపడ్డాయి. ఒక గంటలోనే 10,138 మంది సింగిల్ రైడర్లు, కేవలం 3,584 మంది డబుల్ రైడర్లు మాత్రమే గుర్తించారు. అంటే 6,554 మంది అధికంగా ఒంటరిగా ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ తీవ్రత పెరుగుతున్నట్లు తేలింది. సింగిల్ రైడింగ్ వల్ల సమయ నష్టం, ఇంధన వ్యయం, ప్రమాదాల ముప్పు, కాలుష్యం పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ చాలా మంది ఒంటరిగానే ప్రయాణించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ-1 హనుమంతరావు, ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్హెచ్ఓ శ్రీధర్ కుమార్, ఆర్ఐ శ్రీకాంత్, ఎస్ఐలు టీవీ రావు, రాములు పాల్గొన్నారు రైడ్ షేరింగ్, కార్ పూలింగ్ పాటించాలి, మెట్రో, బస్సులు వినియోగించాలి, పీక్ అవర్స్లో వ్యక్తిగత వాహనాలు తగ్గించాలి, ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ రహిత సైబరాబాద్ సాధ్యమని పోలీసులు తెలిపారు.