అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
మండలంలోని మల్లాయిగూడెం గ్రామంలో వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం బుధవారం ఘనంగా ముగిసింది. కళాశాల అసోసియేట్ డీన్ డా. హేమంత కుమార్ పర్యవేక్షణలో సాగిన ఈ శిబిరం ముగింపు వేడుకలకు అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ తాను కూడా గతంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి. సేవ చేయాలనే తపన ఉన్నప్పుడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. అనంతరం, ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొని కళాశాల పేరు నిలబెట్టిన వాలంటీర్ కావ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించారు. వారం రోజుల పాటు విద్యార్థులు మల్లాయిగూడెంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి తాగునీరు, విద్య, ఆరోగ్యం మరియు వ్యవసాయ పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరించారు. పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై, గ్రామస్తులకు బాల్య వివాహాల నిరోధం మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయం, మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు వివరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు ప్రదర్శించిన నాటకం గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అసోసియేట్ డీన్ డా.హేమంత కుమార్ శిబిరంలో గుర్తించిన గ్రామ సమస్యల నివేదికను ఎమ్మెల్యేకు అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, మల్లాయిగూడెం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగం వెంకటమ్మ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి. స్రవంతి, డా. ఝాన్సీ రాణి, డా. శ్రీజన్, కళాశాల సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ గ్రామంలో సేవలు అందించిన విద్యార్థులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.